Friday, December 19, 2008

నేస్తం..

రెండు సమాంతర రేఖలు మన రెండు జీవితాలు ఒకటే

సమాంతర రేఖలకు కలిసే అవకాశం శూన్యంలో ఉంటే

మన జీవితాలకి మరుజన్మలో ఉందేమో!
అయినా మరుజన్మలో కలిస్తే ఎంత కలవకపోతే ఎంత

ఎందుకంటే కలుస్తామన్న ఆశతో చావడంకన్నా

కలవలేమన్న నిరాశతో అన్నా ఎదురెదురుగా బతికెయ్యొచ్చు

---------------------------------------------

నీతో సహా
ప్రతీ సాయంత్రం వో దిగులు సంఘర్షణ

ఫోన్లు..కలలు

అన్నీ నిషేధించబడ్డా

నీతో సహా

అలిగి మూలక్కూర్చున్న మనసు

దేహమంతా దిగులు

వర్షంతడిసి ముద్దయిన మనసు

వో నులువెచ్చని స్పర్శకై ఆరాటం

ఎవరికీ ఏమీ పట్టదు

నీతో సహా

----------------------------------

ది ఎండ్

కలలెప్పుడూ అంతే

నాకూ ఆమెకూ మధ్య

మిల్లీమీటర్ దూరాన్ని కూడా మిగల్చవు

యేంటి ఫ్రీగా ఉన్నావా..?

మనసుని కష్టపెట్టుకుంటున్నావ్

అయితే గుండెని పొడిచేస్కో

తూట్లు తూట్లుగా

డౌటుంటే తడిమి చూస్కో

రక్తం అంటిందో లేదో

ఎందుకు గురూ..!

ఆ రోజు అలా ఆలోచించావ్

అపార్ధం చేసుకున్నట్టున్నాయి ఆ చూపులు

ఆ క్షణం గుర్తొచ్చినప్పుడల్లా

మనసులో ఏదో బాధ కదూ

నాకు తెలుసు బాసూ

నీది నిష్కల్మషమైన మనసని

లైట్ తీస్కో

ఇంకా ఎన్నాళ్ళిలా

ఆ డొక్కు డైరీకి

అట్టలేసుకుంటూ మురిసిపోతావ్

మనసును ఎందుకిలా రాచి చంపాన పెడుతూ

కవిత్వాన్ని నలిపేస్తావ్

గుండె కవాటంలో కొంతకాలంగా జ్ఞాపకాలు జనిస్తూనే ఉన్నాయ్

గుర్తొచ్చినప్పుడల్లా రాలుతూనే ఉన్నాయ్

మంచు కురిసిన ప్రతీసారీ

నేలరాలే పొగడపూవుల్లా

ఎందుకురా ఇంకా కుస్తీ పడతావ్

శేషం రాని లెక్కలతో

టాలీ కాని ఆ బ్యాలెన్స్ షీట్ తో

ది యండ్ అని రాసి బుక్ మూసేయకూడదూ..!!!- రత్న శ్రీ

Friday, August 29, 2008

"గిడుగు" జయంతి సందర్భంగా :: తెలుగుకు ఎందుకీ తెగులు??

ప్రపంచీకరణ తెలుగుభాషపై దురుసుగా దాడి చేస్తోంది. అడ్డుకోవాల్సిన ప్రభుత్వం నిర్లిప్తంగా కనిపిస్తోంది. తెలుగు భాష అమలుకు అధికార భాషా సంఘం ఉంది. అయినా అన్ని చోట్లా తెలుగు కనిపించదు.. అసలు తేట తెలుగు మాట్లాడేవారే కరువు. సౌకర్యం పేరిట ప్రభుత్వమే పరోక్షంగా ఇంగ్లీష్ ను ఆదరిస్తోందీ.. ప్రోత్సహిస్తోంది..

భారత దేశంలో గుర్తింపు పొందిన 18 భాషల్లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య రెండొ స్ధానంలో ఉంది. తెలుగు సాహిత్యానికి ఎంతో చరిత్ర ఉంది. పాలనా భాషగా, బోధనా భాషగా, వ్యవహార భాషగా అమలైనప్పుడే ఏ భాషకు అయినా మనుగడ ఉంటుంది. ఈ మూడింటిలోనూ తెలుగు నిరాదరణకు గురవుతోంది.అధికార భాషగా స్ధిరపడటానికి తెలుగు చాలా దూరమే ప్రయాణించింది. ఇప్పుడు ప్రపంచీకరణ అన్ని రంగాలపైనా కోలుకోనివ్వనంత వేగంగా దాడి చేస్తోంది. సామాజిక జీవనంలో అతి కీలకమైన భాష కూడా అందుకు మినహాయింపు కాదు. ఇది ఒక్క తెలుగు ఎదుర్కొంటున్న సమస్య అనుకుంటే పొరపాటే.. ఈ జగత్తులోని ఆరు వేలకు పైగా భాషల్లో సగానికిపైగా భాషా సంస్కృతులకు క్రమంగా కాలదోషం పడుతోందని ఐక్యరాజసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్ధ కొన్నేళ్ళ క్రితమే తేల్చి చెప్పింది. అంతెందుకు, ఏ భాషనైతే ఆ ప్రాంతంలోని ముఫై శాతం మంది ప్రజలు మాట్లాడకుండా ఉంటారో.. అది మృత భాషగా మారినట్లే.. ఇప్పుడు తెలుగు కూడా ఆ జాబితాలో ఉందన్నది యునెస్కో నివేదిక మాట. తెలుగుభాషకు కొత్త జీవం ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలూ జరక్కపోలేదు. తెలుగు భాషను వివిధ స్ధాయిలో ఎలా సమర్ధంగా అమలుచేయాలనే దానిపై సూనలందించేందుకు అధికార భాషా సంఘాన్ని నియమించారు. అధికార భాషా చట్టం వచ్చింది. అమలులోనే చిత్తశుద్ధి లోపించింది.

ఇప్పుడు కావాల్సింది మన తెలుగు భాషను అందరికీ ఉపయోగపడే భాషా సాధనంగా తీర్చిదిద్దుకోవడమే. అసలు ఇన్నేళ్ళుగా మన భాషా విధానం విఫలమవ్వడానికి కారణాలేమిటి? అధికార యంత్రాంగమేనన్నది కొందరి అభిప్రాయం. మరి ఈ అధికార పద్దతుల్లోనే అధికార భాషగా తెలుగు అమలుకు ప్రయత్నించడం ఎంతవరకూ సమంజసం? మరి దీనికి పరిష్కారం ఏమిటి? మన భాషలో పాలన జరిగితీరాలన్న చైతన్యాన్ని జనంలో పెంచాలన్నది ఓ సూచన. అలాగని పూర్తిగా తెలుగు భాష నిరాదరణకు గురయిందనీ చెప్పలేని పరిస్దితి. తెలుగులోనే కోర్టు తీర్పు వచ్చింది. కొన్ని జిల్లాల్లో అధికారులు ఉత్తరప్రత్యుత్తరాలను తెలుగులోనే నిర్వహిస్తున్నారు కూడా.

సర్వకాల సర్వావస్ధల్లోనూ స్వీకరించడానికి వీలుగా తెలుగు భాషాభివృద్ధి జరగాలంటున్నారు భాషా వేత్తలు. ఇప్పుడు తెలుగు భాషకున్న పెద్ద సమస్య పదసంపద. గిడుగు రామ్మూర్తి పంతులు గ్రాంధిక భాషను వదిలిపెట్టి వ్యవహారిక భాషను ప్రజాబాహుళ్యంలోని తీసుకెళ్లారు. అందువల్ల గ్రాంధిక భాషలోని కొన్ని పదాలు వాడుకలోకి రాకుండా ఉన్నాయన్న వాదన కూడా ఉంది. తిక్కన లక్ష తెలుగు పదాలు వాడారంటారు. అయినా, తెలుగు నిఘంటువు మొత్తం నలభైవేల పదాలకు మించడం లేదు. మరి ఈ అరవై వేల పదాలూ ఏమైనట్టు? ఇవన్నీ వాడుకభాషలోనుంచి గ్రంధాల్లోనికి కనిపించకుండా పోయాయి. ఏది ఏమయినా.. తొనినాళ్ళుల పద్యార్ధము తెలియనిచో అది పాఠకులకు దోషము.. నేడొ కవిదోషము.. అన్న విశ్వనాధ సత్యనారాయణ గారి వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమనిపిస్తోంది..!

Sunday, August 24, 2008

Thursday, July 24, 2008

మరోసారి మరోసారి మరోసారి సిగ్గుపడదాం


అనుకున్నట్టే జరిగింది.ప్రజాస్వామ్యం నవ్వులపాలైంది. అరవయ్యేళ్ళ స్వాతంత్ర్యం అవాక్కయింది. అత్యున్నత చట్టసభ పార్లమెంట్ లో వలువల విలువల్ని ఎంపీలే స్వయంగా కీచకులై వలిచిన దృశ్యం భారతీయుల గుండెల్లో గునపమై దిగబడింది. హార్స్ ట్రేడింగ్ ఎలా ఉంటుందో..పచ్చనోట్ల సాక్షిగా ప్రజాప్రతినిధులే దేశానికి చూపించిన అరుదైన ఘట్టమిది. అధికారపక్షం బలపరీక్ష ధనపరీక్షగా మారిన ఘన చరిత్ర ఇది. హైడ్ యాక్ట్ అంటే ఏమిటో.. అణు ఒప్పందమంటే ఏమిటో..పార్లమెంట్లో మెజారిటీ నిరూపణ అంటే ఏమిటో తెలియని అమాయకులతో నిండిన దేశం నిలువునా నీరుగారిపోయింది. ఎంపీల అమ్మకాల కొనుగోళ్ళ అడ్డాగా పార్లమెంట్ ఎంత వెలిగిపోతోందో స్వయంగా చూసి ప్రతీభారతీయుడు తరించిపోయిన అపూర్వ ఘడియలివి. మనమీద మనకే సిగ్గేస్తుంది. మనమీద మనకే అసహ్యం పుడుతుంది.అవినీతి పెంటకుప్పలో పొర్లాడుతున్న మన ఏలికల వాలకం చూసి మనమీద మనకే రోతపుడుతుంది. ఎవరిని ఎవరూ పోల్చుకోలేది ఒక దొంగాటకంలో అందరూ పాత్రధారులే అయిన నీఛాతి నీఛ సన్నివేశం. అంగబలంతోనో, అర్ధబలంతోనో ..కండబలంతోనో.. గద్దెనెక్కడమే పరమావధిగా ఎంచుకున్న నాయకమ్మన్యుల అసలు రంగు బయటపడిన నికృష్ట సందర్భమిది. మనం వారి ధర్నాలకూ.. ర్యాలీలకూ.. బహిరంగ సమావేశాలకూ లారీలకొద్దీ బయలుదేరిన సజీవ శవాలమవుతాం. వారి సింహాసనాలకోసం దొంగ ఓట్లమవుతాం. వారి అక్రమ ఆస్తుల సౌధాలకు పునాదిరాళ్లమవుతాం. వారి చీకటి రాజకీయాలకు చిటికెలు వేసే చిల్లర రాయుళ్ళమవుతాం.ఏమయినా అవుతాం. వారి అధికార లాలస కోసం మనం సమిధలవుతాం. అంతా అయిపోయింది. ఆశయాలకోసం శువులిచ్చిన అమరుల త్యాగం వృధా అయిపోయింది. నీతి.. నిజాయితీ.. నిస్వార్ధం.. అన్నీ ఉన్నట్టుండి నిఘంటువుల నుంచి ఎగిరిపోయాయి. మానవీయ విలువలు మంటగలిసిపోయాయి. దొంగలు, బందిపోట్లు, అండర్ వాల్డ్ డాన్లు, ఎవరూ తమకు పోటీ రాలేరై పార్లమెంట్ సభ్యులే తొడకొట్టి మరీ నిరూపించుకుంటున్న పరమ భీభత్సదారుణం ఇది. మరోసారి మరోసారి మరోసారి సిగ్గుపడదాం. ఎవరినీ ఎవరం చూసుకోకుండా జాగ్రత్తపడదాం. ఇంక మాట్లాడుకోవడానికేమీ లేదు కాబట్టి మన చేతకానితనానికి మనమే జేజేలు చెప్పుకొని మురిసిపోదాం. మేరా భారత్ మహాన్..!

Monday, May 12, 2008

"అరకు" అనుభవాలు - 2

మొదటి భాగం చదివి రెండుకి రండి..

అరకు ఒక రకంగా రూఫ్ టాప్ లాంటిది. లొండలెక్కిన తర్వాత కనిపించే లోయ,ఆ లోయలో అరకు ఓ చిన్న గ్రామం ఒకప్పుడు లెండి.. ఇప్పుడు కాస్తో కూస్తో డెవలప్ అయింది. మూడు వేల రెండువందల అడుగుల ఎత్తులో ఉండే అరకులో ఉద్యానవనాలు , జలపాతాలూ, ట్రైబల్ మ్యూజియం చూసి తీరాలి. పద్మాపురం గార్డెన్స్, ఓపికుంటే రణజిల్లెడ జలపాతం దగ్గరికి వెళితే బోలెడు ఎంజాయ్ మెంట్. పద్మాపురం గార్డెన్స్ లో ఈ ప్రాంతపు వృక్షజాతులను చూడొచ్చు. పామ్ జాతికి చెందిన జీలుగు చెట్టు ఇందులో ముఖ్యమైనది. దీని నుంచి తీసే జీలుగు కల్లును గిరిజనులు చాలా ఇష్టంగా సేవిస్తారట. ఇంకా లిచ్చీ వంటి ఫలజాతులు, మరెన్నో పుష్పజాతులు ఇక్కడ కనువిందు చేస్తాయి. బస చేసేందుకు టూరిజం వారి హోటల్స్ తో పాటు ప్రతీ డిపార్ట్ మెంట్ కీ అరకులోయలో గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.ఇక గార్డెన్స్ లో టాయ్ ట్రైన్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్. ఉద్యానవన శాఖ నర్సరీ ఉంది. ట్రైబల్ మ్యూజియంలో గిరిజనుల వారసత్వం, జీవనాధారం తెలియజెప్పే ప్రదర్శనలున్నాయి.
చుట్టూ ఉండే గిరిజన ప్రాంతాలకు కేంద్రంలాంటిది అరకులోయ. ఇక్కడ వాల్మీకి, బగత, ఖోండ్, రోటియా తదితర గిరిజన తెగల వాళ్ళు నివసిస్తారు. కొన్ని ఆదిమ గిరిజన తెగలూ ఇక్కడ ఉండటం విశేషం. చెట్లను నరికి పోడు వ్యవసాయం చేయడం, అడవుల నుంచి ఆహార సేకరణ వీరి జీవనాధారం. వీరు తమ ఉత్పత్తులను సంతల్లో అమ్ముకుని తమకు అవసరమైన సరుకులు కొనుక్కొని వెళుతుంటారు. చైత్రమాసంలో అలాగే పెళ్ళిళ్ళప్పుడు, పండగలప్పుడు వీరు ధింసా అనే డ్యాన్సు చేస్తారు. మామూలుగా చూస్తే ఒకటే డ్యాన్సు అనిపిస్తుంది కానీ ఇందులో బోడ ధింస, గండేరీ ధింస, గొడ్డిబేట ధింస అంటూ సుమారు ఎనిమిది రకాలుంటాయి. ధింసకు కిరిడి, తుడుము, డప్పు, జోడు కొమ్ములు అనే వాయిద్యాలను ఉపయోగిస్తారు. బీదాగొప్పా పెద్దాచిన్నా తేడా లేకుండా అందరూ కలిసి సమిష్టిగా చేసే డ్యాన్స్ ఇది.
ఇక అరకు నుంచి తిరిగొచ్చేటప్పుడు తప్పనిసరిగా చూడాల్సిన స్పాట్స్ లో అనంతగిరి, బొర్రా కేవ్స్ ఉంటాయి. సహజసిద్దంగా ఏర్పడిన బొర్రా కేవ్స్ లో ఓ రౌండ్ వేస్తే అదో అనుభూతి. 1807లో విలియం అనే బ్రిటీషర్ వీటిని కనుగొన్నాడని చెబుతారు. కానీ గిరిజనులకు ముందునుంచే ఇవి తెలుసు. గుహ పైకప్పుకు ఉండే రంధ్రం నుంచి ఓ ఆవు జారిపడినప్పుడు గుహల సంగతి ఎరుకైందని గిరిజనులు చెప్పుకుంటారు. మూడు వందల మీటర్ల వెడల్పు, నలభై మీటర్ల లోతు ఉన్న ఈ గుహలు సముద్ర మట్టానికి ఏడు వందల డెభై రెండు మీటర్ల ఎత్తులో ఉంటాయి. బొర్రాగుహల స్టేషన్ వెనుక నుంచి వీటికి దారి ఉంది. గుహలోకి దిగడానికి టూరిజం వారు మెట్లు నిర్మించారు. ఈ గుహ చూరు నుంచి నిరంతరాయంగా ఖనిజవణాలతో కూడిన నీరు బొట్లు బొట్లుగా కారుతుంటుంది. ఆ నీటిలోని ఖనిజాలు రాను రాను రాయిలా ఏర్పడి కింద నుంచి పైకి మినరల్ బ్లేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటినే స్టేలగ్మైట్ లు, స్టేలటయిట్లు అంటారు. కొన్ని చోట్ల సహజంగానే చిత్రవిచిత్ర ఆకారాలు ఏర్పడతాయి. ప్రకృతి, కాలం కలిసి చెక్కిన శిల్పాలివి. సీతారాములు వనవాస సమయంలో ఈ గుహల్లో నివసించారని కూడా చెప్పుకుంటారు. దీని సమీపంనుంచే గోస్తని నది ప్రవహిస్తుంటుంది.
ఇక బొర్రా నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఓ జలపాతం ఉంది. అది కాటికి మండలం కిందకు వస్తుంది. అక్కడకు చేరుకోవాలంటే జీపు ఒక్కటే మార్గం. అదీ కాస్త దూరం దాకానే. అరకు వెళ్ళేందుకు రైలుమార్గం దాకా అక్కడి గిరిజనులు ఏదో తమవంతు సాయంగా ఓ మట్టి రోడ్డులాంటిది నిర్మించారు. దానిగుండా వెళ్ళేందుకు వాళ్ళకి ఛార్జి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అక్కడ్నుంచి రైలుపట్టాలెక్కి ..మళ్ళీ దిగి దాదాపు మూడు కిలోమీటర్లు అడివిగుండా ప్రయాణిస్తే జలపాతం. యాభై అడుగుల ఎత్తునుంచి పడే జలపాతాలను చూస్తే అక్కడిదాకా నడిచిన మాట మర్చిపోతాం. అంత అందంగా ఉంతాయవి.
ఇక అనంతగిరి. మన రాష్ట్రంలోకెల్లా ఎత్తైన ప్రదేశంలో ఉందిది. దీని చుట్టూ కాఫీతోటలు ఉన్నాయి, ఊరిచుట్టూ ఉండే కొండలమీద నుంచి దూకే జలపాతాలు కనువిందు చేస్తాయి. అనంతగిరిలో సీనిక్ బ్యూటీ ఎంజాయ్ చేయాలంటే గాలికొండ చేరుకోవాల్సిందే. ఇది సముద్ర మట్టానికి అక్షరాలా మూడువెల ఏడువందల మీటర్ల ఎత్తులో ఉంది. ఇకపోతే డార్జిలీంగ్ టీ లెవెల్లో అరకులోయ కాఫీని మార్కెట్ చేసేందుకు కాఫీ బోర్డు పెద్దఎత్తున ప్రయత్నాలు చేపట్టిందంటే ఇక్కడి కాఫీ మహత్యం ఏంటో తెలుస్తుంది. ఇక్కడి కాఫీ తోటల్లో విహారం బాగుంటుంది.
అరకులోయ వెళ్ళినవారు తిరిగిరాలేక రాలేక తిరిగివస్తారు. అంతగా కట్టిపడేస్తాయి అక్కడి అందాలు.. కొండలోయలు. పచ్చదనానికి వీడ్కోలు పలకాలంటే మనసొప్పదు. వగౌలు వంకలు బైబై చెబుతుంటే మనసు బరువెక్కుతుంది. మళ్ళీ వద్దామని మనసుకు తృప్తిపరచుకొని వెనక్కు తిరిగిరావడం తప్ప చేసేదేముంది?? దటీస్ అరకు..

Friday, May 9, 2008

"అరకు" అనుభవాలు - 1


ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న పొగమంచు. ఆ మంచులో మత్తుగా పడుకున్న కొండచిలువ లాంటి రైల్వే ట్రాక్. దారి పొడవునా ఆకాశాన్నంటినట్టుగా వుండే సిల్వర్ వోక్ చెట్లు. వాటి పక్కనే గాలికి స్లో మోషన్‍లో ఊగుతున్నట్టుగా దేవదారు కొమ్మలు. రోడ్డుకు ఇరువైపులా పచ్చటి తివాచీ పరచినట్టుగా వున్న పచ్చిక బయలు. దాని మీద అందంగా ట్రిమ్ చేసిన పొదలు. వాటి మధ్యలో అప్పుడే తలారా స్నానం చేసినట్టుగా ఉన్న క్రిస్మస్ చెట్లు. దూరంగా కొండల్లోంచి కోకిల గొంతుకు తీతువుపిట్ట స్వరం తోడయి ఎకో ఎఫెక్ట్ లో వినిపిస్తున్న వింత శబ్దాలు.యూకలిప్టస్ ఆకుల చిలిపి సయ్యాటలు. వాటి నుంచి వచ్చే సౌగంధానికి గమ్మత్తుగా మూసుకుపోతున్న కనురెప్పలు. దూరంగా తేయాకు తోటలనుంచి ఘుమఘుమల్ని మోసుకురావడానికి ప్రయాస పడుతున్న పిల్లతెమ్మెరలు. అక్కడక్కడా బొమ్మరిల్లుల్లాంటి విడిదిగృహాలు.దారిపొడవునా గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే మట్టిప్రతిమలు...దేవుళ్ళ విగ్రహాలు. గలగలమంటూ దూకే అందమైన జలపాతాలు. ఇవీ మంచు ముసుగును కప్పుకొని తొంగిచూస్తున్న అరవిరిసిన అరకులోయ అందచందాలు. ఇక్కడికెళ్ళిన ప్రకృతి ఆరాధకుడు మరపురాని అనుభూతులని గుండెనిండా నింపుకొని వెళ్తాడు.
అరకు వెళితే మనసు మరోలోకంలో తేలిపోతుంది. అన్నీ మరచిపోయి హాయిగా అక్కడే ఉండిపోతే ఎంతబాగుండు అనిపిస్తుంది. భూమికి పచ్చని రంగేసినట్టు ఎటుచూసిన హరితవర్ణమే. ఆహ్లాదకరమైన వాతావరణమే. ఎత్తైన కొండలు అంబరాల అంచును చూద్దామంటాయి. గంభీరమైన లోయలు తమ లోతు కనుక్కోమంటాయి. అడుగడుగునా కొండవాగుల పలకరింతలు..కొండకోనలనే నెలవుగా మలచుకున్న గిరిజనం.. చెట్టుపుట్టలనే నమ్ముకున్న వారి జీవనాధారం.. అరకు అంటే మట్టిమనుషుల పచ్చని వాటిక. అరకు అంటే పర్యాటకుల ఆహ్లాద పేటిక. అడవితల్లికి దండాలు అనిపించే అపురూపమైన స్ధలం.
నేను అరకు సీనరీలను సినిమాల్లోనే చూడ్డం.. లేకపోతే అబ్బో అరకు అందాలు అని కళ్ళింత చేసుకొని చూసొచ్చినవాళ్ళు చెబితే చెవులింత చేసుకొని విన్నాను.ఇక ఆగలేను మొర్రో అని అరకులోయ అందాలను చూసొద్దామని బయల్దేరాం మేం ఐదుగురు మిత్రులం..


విశాఖ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకులోయలు రైలుమార్గంలో వెళ్ళాలంటే కిరండూల్ కొత్తవలస ట్రైన్ ఎక్కాలి. ఈ సెక్షన్లో నడిచే ఏకైక ప్రయాణీకుల రైలు అదే. ఇది రోజూ ఉదయం ఆరున్నరకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. శృంగవరపు కోటదాకా మైదాన ప్రాంతం.. అక్కడ్నుంచి ఘాటీ సెక్షన్ మొదలవుతుంది. మన ధ్రిల్ మొదలయ్యేది కూడా ఇక్కడ్నుంచే. నిజానికి ఈ రైలు మార్గం వేసింది బైలదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖ రేవుకు తరలించేందుకు. దీనిమీదే కిరండూల్ రైలు ప్రవేశపెట్టారు. ఈస్ట్ కోస్ట్ సెక్షన్ పై ఈ రైలు కొత్తవలస దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని అరకు మార్గం పడుతుంది.అంతిమగమ్యం కిరండూల్. అందుకే దీనికి కొత్తవలస-కిరండూల్ రైలు.. లేదా షార్ట్ గా కెకె రైలు అని పేరు వచ్చింది. కొత్తవలస నుంచి బయల్దేరి రెండు స్టేషన్లు దాటాక శివలింగపురం అనే ఊరు వస్తుంది.





ఇక్కడ్నుండే రైలు కొండలెక్కడం మొదలవుతుంది. గోస్తని నది లోయ . దని చుట్టూ రక్షణ కడ్యంలా నిల్చున్న కొండలు..ఆ కొండల మీదుగా రైలు ప్రయాణం. ఎక్కడ చూస్తే అక్కడ పచ్చదనం. దారిపొడవునా స్వాగత తోరణాల్లాంటి కొండవాగులు, జలపాతాలు, రైలుకు ఎడమవైపుగా, లోయలు కుడివైపుగా వస్తాయి. రైలు ఎత్తుకు చేరుకున్నాక అసలు మజా ఉంటుంది.కిందకు చూస్తే అగాధంలాంటి లోయలు. పైకి చూస్తే భీకరమైన కొండలు. కొండల ఎత్తు సముద్ర మట్టానికి ఆరువందల నుంచి తొమ్మిది వందల మీటర్ల దాకా ఉంటుంది. ఈస్ట్రన్ ఘాట్స్ లో ఈ కొండలు ఓ భాగం. రైలు పాములా జరజరా పాకుతూ కొండలను చుట్టేస్తుంటే అటు ప్రకృతి.. ఇటు మానవ మేధస్సూ రెండూ అబ్బురపరుస్తాయి. దారిలో ఎనభై నాలుగు వంతెనలు, యాభై ఎనిమిది టన్నెల్స్. గాలిలో తేలుతున్నట్టుండే వంతెనలు, కొండలను తొలిచి నిర్మించిన టనెల్స్..వీటి గుండా ప్రయాణం.అరకు వెళ్ళే దారిలో అతిపెద్ద టనెల్ పొడవు అరకిలోమీటర్ పైనే. వంతెన తర్వాత టనెల్.. టనెల్ తర్వాత వంతెన అన్నట్టు సాగుతుంది ప్రయాణం. మధ్యలో కొండల మీదుగా దూకే ఏర్ల నుంచి తుంపరలు వంటిమీద పన్నీరులా పడి గిలిగింతలు పెడుతుంటాయి. దారిలో గిరిజన గ్రామాలు. కొన్ని దగ్గరగా..కొన్ని అల్లంతదూరంలో. చుట్టూ అడివి.రైలు శబ్ధం తప్ప మరో శబ్ధం వినపడదు. కళ్ళముందు పరచుకున్న పచ్చదనం. అక్కడక్కడా చిన్న వాగులు. వీటిని స్ధానికులు గెడ్డలని పిలుస్తారు. ఇలాంటివి ఎన్నున్నాయో లెక్కపెట్టడం సాధ్యంకాదు . మధ్యలో బొర్రాగుహల స్టేషన్ వస్తుంది. తర్వాత వచ్చేది సిమిలిగూడ.ఈ సెక్షన్ లో ఎత్తయిన స్టేషన్ ఇదే. రైలు మ్యాగ్జిమం ఎత్తుకు చేరుకునేది ఇక్కడే. తర్వాత వచ్చేది అరకు.. ద ఫైనల్ డెస్టినేషన్...

Monday, March 31, 2008

ఫూల్స్ డే - అ౦దరూ వెధవాయలే!

ఫూల్స్ డే - అ౦దరూ వెధవాయలే!

రచన : కేబీ ఎస్ శర్మ, ( తెలుగు జర్నల్ సౌజన్యంతో)

ప౦డుగలు - అర్ధ౦కానివి, అనర్ధకాలు చరిత్రలో ఒక్కో రోజు ఒక్కొక్క విషయానికి ప్రాధాన్యత స౦తరి౦చుకు౦టు౦ది. ప్రముఖ వ్యక్తి జయ౦తి, వర్ధ౦తి, అన్వేషణ, ఘనకార్య౦, తలమానిక౦, ఏదైనా కావచ్చు. చరిత్ర తనలో యిముడ్చుకున్న పద్ధతుల్ని బట్టి దాని ప్రాధాన్యత రకరకాలుగా ప్రభావ౦ చూపుతు౦ది. ఒక్కొక్క స౦ఘటన ప్రయోజనాన్ని, మరొకటి ప్రయోగాన్ని అ౦దజేస్తు౦ది. కొన్ని, వ్యర్ధ౦, అనర్ధాల్ని అ౦దిస్తు౦ది. ప్రయోజన౦ లేని ప్రయోగాల్ని అ౦దిస్తు౦ది. వాటినే చరిత్ర భద్రపరచుకుని, వార్షీకాన్ని నిర్వహిస్తు౦ది కూడా. అటువ౦టి ప్రతిఏటా ప్రత్యక్షమవుతున్న రోజు - ఆల్ ఫూల్స్ డే అని ప్రతి ఏప్రిల్ 1వ తేదీన జరుపుకునేది. వెధవాయితనానికి ప౦డుగల్లో కేటాయి౦పు ఒక్కొక్క మాటకు చరిత్ర వు౦డదు. వాట౦తట అవే చరిత్రలో చొచ్చుకుపోతాయి. ఏ తెలుగు నిఘ౦టువు లోనూ కనపడని పద౦ - వెధవ అన్నది. దీనికి అర్ధ౦ మాట ఎలా వున్నా, లి౦గ నిర్ధారణ కూడ చేయలేము. కొన్ని మాటలు వాడక౦ లో ప్రజల నాల్కలమీద నిత్య౦ నాని, నాట్య౦ చేస్తూనేవు౦టాయి. ఈ పద౦ అటువ౦టిదే అని అ౦దరూ అ౦గీకరి౦చవలసి౦దే. కాదన్న మాదన్నలకు అన్యధా వాది౦చలేరు కనక. ఏదైనా, ప౦డుగ వచ్చేసి౦ది. జరుపుకో౦డి. యిటువ౦టివి కలికాల౦లో వస్తాయని, గ్రహి౦చి, ము౦దుచూపుతో, భగవద్గీత లో శ్రీకృష్ణభగవానుడు, అర్జునునికి చెప్పవలసిన ఉపదేశాన్ని బోధి౦చి, చివరకు - యధేచ్చసి తధాకురు అని - నీకు ఏది యిష్టమో అది చేసుకో! అన్నాడు గీతాచార్యుడు. యిదే మాటని కన్యాశుల్క౦లో మహాకవి గురజాడ తెలివిగా, తా౦బూలాలిచ్చేశాను, తన్నుకు చావ౦డి! అనిపి౦చాడు, అగ్నిహోత్రావధానుని నోటిను౦చి. పదే పదే ఆమాటే! కన్యాశుల్క౦లో, గిరీశ౦ పాత్రని మెచ్చుకోనివారు వు౦డరు. ఆశ్చర్య౦ ఏమిట౦టే, గిరీశ౦ పాత్రద్వారానే, ఈ వెధవమాటలు పదే పదే వస్తాయి. మచ్చుకు - మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్ అన్న గిరీశ౦ మాట నేటికీ రిజర్వ్ బ్యా౦కు కొత్తనోటులా జరజర చెలామణి అవుతున్నది. సాధారణ౦గా, మగవాణ్ణే మన౦ వెధవా అని తిట్లు తిడుతు౦టాము. వెధ్వల్ అన్నది లాటిన్ మాట౦డి, ఆ మాట కర్ధ౦ కచేరీలు అన్న బుకాయి౦పులు కూడ తరచు కోతలు కోస్తు౦టాము. గురజాడవారు, వెధవలకి మఠ౦ కట్టారటాని, విత౦తువు ప్రస్తావనలో వెక్కిరి౦చే వెధవల నోళ్ళలో వు౦ది అని చురకలు వేయిస్తాడు. మొగాడు వెధవేమిటి? అది కేవల౦ స్త్రీ లి౦గ౦ అని బుచ్చిబాబు అన్నాడు. పానుగ౦టి వారి సాక్ష్యి సాహితీవ్యాసాల్లో, అనేకచోట్ల వెధవల భాగోత౦ వు౦ది. మన చాటువుల్లో కూడ, వెధవలను విధ౦ విధ౦గా వర్ణి౦చారు. మచ్చుకు - మడ్డి, బడుగు, కొ౦టె, మేటి, శుద్ధ, వట్టి, ప౦ద, వుత్త, ప౦జి, ముష్టి, అ౦టు వెధవలని చెప్పిన మాట చెప్పిన చోట చెప్పకు౦డా చెప్పుకొచ్చారు, మన వ్య౦గ సాహితీకారులు. కేవల౦ వర్ణనలకు, పాత్రలకు మాటలు అని చెప్పలేదు. పాత్రలకు ఆ సమర్ధతలున్నాయి కనుకవే, వారిని ఈ గుణాలతో గుణి౦చారు. ఆ౦గ్ల పద౦ ఫూల్ అ౦టే అర్ధ౦ ఏమిటి ? మూర్ఖుడు, మూఢుడు, తెలివితక్కువమనిషి, అవివేకుడు, అనాలోచితుడు, అని వివరి౦చారు పదకోశనిర్మాతలు.ఈ వెధవ మహనీయుల నివాసాన్ని గాలిమేడ, గ౦ధర్వ గృహ౦, నగర౦ అని కూడా చెప్పారు. దీన్ని బట్టి మనవాళ్ళు వట్టి వెధవాయిలు కారు, మహాగట్టి వెధవాయిలే. వెధవలకు అత్యధిక గుర్తి౦పు ? ఒక్కొక్కసారి, మూర్ఖులు, మూఢులు చేసే తప్పు పనికి గుర్తి౦పు వస్తు౦ది. తెలివైనవాళ్ళు ప్రదర్షి౦చే జ్ణాన౦ మెప్పు పొ౦దదు. అన్నివేళలా నిజ౦ చెప్పే సత్యహరిశ్చ౦ద్రులు, తరచుగా యిబ్బ౦దులు పడతారు. అ౦దుకే, శాస్త్రకారుడు, వారిజాక్షుల౦దు, వైవాహికముల౦దు, చకిత గోకులాగ్ర రక్షణమ౦దు ... ఆడి బొ౦కవచ్చు అని ఆపద్ధర్మసూత్ర౦ చెప్పినప్పుడు, మన౦ తరచుగా మన పిల్లలను, వాడు అస్తమాన౦ అబద్ధాలు వల్లిస్తాడు, వొట్టి వెధవాయ్ అన్న దా౦ట్లో ఎ౦త సమ౦జస౦ అన్నది వారి విజ్ణతకే వదిలేయాలి. ఎమైనా అబద్ధాల పు౦డాకోరులు నిజాయితీపరులుగా, సత్యస౦ధులుగా చలామణిగా రాణిస్తున్న కలికాల౦. అన్నీ వు౦టాయి. ఏవీ తప్పవు. ఆల్ ఫూల్స్ డే కధ, కమామీషు ఈ రోజు ప్రార౦భమయిన విధాన౦ మీద సరియైన ఆధారాలు లేకపోయినా, విశ్వవ్యాప్త౦గా ప౦డుగలమాదిరి స౦బరాల్ని జరుపుకోవడ౦ జరుగుతో౦ది. యిదివరలో, నూతన స౦వత్సర వేడుకలను మార్చి 25 ను౦చి ఏప్రిల్ 2 వరకు జరుపుకొనేవారట. జనవరి 1 న, నూతన స౦వత్సరాన్ని జరుపుకోవడ౦, ఫ్రాన్స్ దేశ౦ అధికారిక౦గా మొట్టమొదట ప్రకటి౦చి, మార్చిన ఫలిత౦గా, ఏప్రిల్ 1 న జరుపుకునే ప౦డుగలు, జనవరి 1 నాటికి వాయిదా పడినాయట. ఈ మార్పు తెలియనివారు, మార్పులో అయిష్టులు, తిరస్కరి౦చి బహిష్కరి౦చి, మునుపటిలాగునే, జనవరి 1నే జరుపుకున్నారు. క్రమేపీ దీని ప్రభావ౦ తగ్గిపోయినా, లేని ప౦డుగను జరుపుకోవడ౦ మూర్ఖత్వ౦, మూఢత్వ౦గా పరిగణిస్తూ, వెధవాయితన౦గా జమకట్టారు. అలా దాన్ని, వెధవాయిలప౦డుగగా మారివు౦డవచ్చు. ఈ రోజు అనేక మార్పులు చేసుకుని, కొత్తపు౦తలు తొక్కి౦ది. చివరికి ఆటపట్టి౦పు గా మారి౦ది. ఈ తీరుతెన్నులు చివరికి, వార్తాపత్రికలు, రేడియోలు, టివీచానెళ్ళు, అ౦దరూ వేళాకోళపుధోరణులను మానలేకు౦డా వున్నారు. అది పరిహాస౦, అపహాస్య౦, వెకిలిహాస్య౦గా మారి,వెధవాయిల ప్రదర్శనలదిన౦ గా మారిపోయి౦ది. నమ్మడ౦, నమ్మకపోవడ౦ జరుగుతాయి మరి! ఈరోజు జరిగినవి, జరుగుతున్నవి, జరిగాయని చెప్పినవి, అన్ని౦టినీ నమ్మడ౦, మోసపోవడ౦, నమ్మకపోవడ౦, తర్వాత నిజ౦ తెలుసుకుని, నిరాశపోవడ౦, ఊపిరిపీల్చుకోవడ౦, అశా౦తిచె౦దడ౦, శతృత్వాల్ని పె౦పొ౦ది౦చుకోవడ౦ అలా అలా యధాలాప౦గా జరిగిపోతాయి. అనుకోని దుర్ఘటనలు జరిగినా పట్టి౦చుకోకపోవడ౦ కూడా జరుగుతు౦ది. నాన్నా పులి, అని ఆటలాడి, చివరికి పులి నిజ౦గా రావడ౦పట్ల నాన్న నమ్మకపోవడ౦, పులి పిల్లవాడ్ని బక్షి౦చడ౦ జరిగిపోతు౦ది. మూర్ఖ, మూఢ తత్వాల్ని విడనాడ౦డి ! ఈ రోజు ఏ పరిస్థితుల్లో ప్రార౦భమయి౦దో ఆనాటి పరిస్థితుల్ని గౌరవిస్తూ, ఆ సదాచారాలకి వక్రభాష్య౦ చేస్తూ, ఆరోగ్యకరమైన హాస్యధోరణిని వదలి, అపహాస్య, అవా౦తరధోరణుల్ని వదలి, యిటువ౦టి రోజుల్ని, సమాజానికి మరి౦గ ప్రయోజన౦ చేకూర్చేవిధ౦గా, ఉపకార, ప్రత్యుపకారపద్ధతుల్ని చేపట్టి, మూర్ఖ, మూఢపద్ధతుల్ని౦చి తరలి, వెధవాయితనాన్ను౦చి విజ్ణతకూడిన వివేకవ౦తులుగా మారి స౦ఘసేవలో పాల్గొనవలసిన సమయ౦ ఆసన్నమై౦ది అని గ్రహి౦చి, ప్రతిజ్ణాపూర్వక సత్స౦కల్పక౦కణాన్ని ధరి౦చి ము౦దుకు సాగిపోవాలి. మార౦డి. మారిపొ౦డి. లేదా, మిమ్మల్ని వె౦టాడే ధోరణి, ప్రముఖ రచయిత, బీనాదేవి - హరిశ్చ౦ద్రమతి లో అన్నట్లు - ఒకవేళ మన౦ ఏదైనా వెధవపని చేసినా, మరొకరు వచ్చి నువ్వుట్టి వెధవ్వి అ౦టే బాధపడకూడదు. ఎ౦చేతన౦టే నువ్వెలాగా వెధవ్వే కాబట్టి. శ్రీశ్రీ అన్నట్లు, మార్పు సహజ౦. తధ్య౦. కాని, ఏవిధ౦గా మార్పుని ఆహ్వానిస్తున్నా౦, ఏదిశగా మారుతున్నాము అన్నదాన్ని బట్టి, మన పురోగమన౦, తిరోగమన౦, ఆధారపడివు౦టాయి. అలనాటి షావుకారుల్ చిత్ర౦లో పాట గుర్తుచేసుకో౦డి. మారునురా కాలము మారునురా, మారిపోవుట దానికి సహజమురా అని అనుకూల, ప్రతికూల ధోరణుల్ని ధ్వనిస్తూ చెప్పడ౦ జరిగి౦ది. ఏమైనా, ఆశని, ఆశయాన్ని విడనాడలే౦. ఫలిత౦ ఎలా పరిణమి౦చినా.